ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు... చేపల కోసం ఎగబడుతున్న జనాలు

నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోనూ గత కొన్నిరోజులుగా గణనీయ వర్షపాతం నమోదైంది. కాగా, వర్షాల ప్రభావంతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, ఇతర జలాశయాలకు వరద పోటెత్తుతోంది.

ఈ నేపథ్యంలో, కొత్త నీటికి చేపలు ఎదురెక్కడంతో వాటిని పట్టుకునేందుకు జనాలు ఎగబడ్డారు. మాదారం చెరువు వద్దకు, నాచేపల్లి వాగుకి చేపల కోసం పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడం కనిపించింది. ముఖ్యంగా నాచేపల్లి వంతెన వద్ద జనసందోహం తిరునాళ్లను తలపించింది. స్థానికులే కాదు, పరిసర గ్రామాల ప్రజలు కూడా చిన్న చిన్న వలలతో ఉత్సాహంగా చేపలు పట్టారు. తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇలాగే చేపలు ఎదురెక్కడంతో వాటిని పట్టుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపించారు.

Fish
Rains
Khammam District
Telangana

More Telugu News